రిటైర్మెంట్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
రిటైర్మెంట్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
X

రాయ్‌పూర్: ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తి అయినట్లు సోనియా చెప్పారు. శనివారం చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలిగా తన ఇన్నింగ్స్‌ను ప్రస్తావిస్తూ, '1998లో కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు గౌరవప్రదమైన అంశం అన్నారు.

25 ఏళ్లలో పార్టీ ఎన్నో పెద్ద విజయాలు సాధించడంతో పాటు నిరాశ కూడా ఎదురైందని చెప్పారు. 2004, 2009లో పార్టీ విజయాలతో పాటు మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వం తనకు వ్యక్తిగత సంతృప్తినిచ్చిందని, అయితే అధ్యక్షురాలిగా తన ఇన్నింగ్స్ 'భారత్ జోడో యాత్ర'తో ముగియడం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ పర్యటన కాంగ్రెస్, ప్రజల మధ్య చర్చల వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని సోనియా గాంధీ అన్నారు.

దేశ సమైక్యతకు గుర్తు కాంగ్రెస్

'భారత్ జోడో యాత్ర'లో కీలకంగా వ్యవహరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశ సమైక్యతకు గుర్తు అని సోనియా చెప్పారు. ‘దేశ సమస్యల కోసం పోరాడతాం. ఇప్పుడు మనం ప్రజల గొంతుకగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. మతం, కులాలు, భాషలతో సంబంధం లేకుండా మనందరి గొంతుకగా ఉండండి. ఇది మన విజయాన్ని ఖాయం చేస్తుంది. రాహుల్ అంకితభావం, నిబద్దత కారణంగా భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. దీనిని విజయవంతం చేసిన ఘనత కూడా యాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ దక్కుతుంది’ అని తెలిపారు.

బీజేపీపై ఫైర్

బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దళితులు, మైనార్టీలు, గిరిజనులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి సంస్థ దుర్వినియోగం అవుతూ... రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయని దుయ్యబట్టారు. కాషాయ ప్రభుత్వం అన్ని సంస్థలను స్వాధీనం చేసుకున్నదని, ప్రతిపక్షాల గొంతును అణిచివేయడంతో పాటు ద్వేషం అగ్నిని రగిలిస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆరోపించారు.

అంతకుముందు కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రెండోరోజు సదస్సును ప్రారంభించారు. దీనికి 'సేవ, పోరాటం, త్యాగం‌' అనే నినాదాన్ని ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నేడు ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్ర సంస్థల సహాయంతో పడగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగినా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ధీటుగా నిలబడ్డారని అన్నారు.

ప్లీనరీ సమావేశాల్లో కీలక తీర్మానాలు

రాబోయే ఎన్నికల్లో గెలుపే వ్యుహంగా ప్రణాళికల రచించేందుకు కాంగ్రెస్ పకడ్భందీగా తీర్మానాలు చేసుకుంది. ముఖ్యంగా పార్టీ సభ్యులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సవరణలు చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఎంపీలు, మాజీ ప్రధానులు, రాష్ట్రపతులకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని తెలిపింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 23 నుంచి 35 కు పెంచాలని తీర్మానించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో డిజిటల్ మెంబర్ షిప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఇవి కూడా చదవండి : సోనియా గాంధీ రిటైర్మెంట్‌పై BJP రియాక్షన్ ఇదే! (వీడియో)



Next Story

Most Viewed